దొంగల కోసం వెళ్లి.. దొరికిపోయారు!

దొంగలను పట్టుకోవడానికి వెళ్లిన విశాఖ పోలీసులు మిస్టరీ గా మారిన పరిస్థితుల్లో రాజస్ధాన్ ఏసీబీకి దొరికిపోయి జైలుకెళ్లారు. రెండు నెలల తర్వాత వారికి శుక్రవారం రాజస్థాన్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విశాఖ నగర శివారు పీఎం పాలెం పోలీస్స్టేషన్ పరిధిలో గత ఏడాది ఆగస్టులో ఒక వ్యక్తిని నిర్బంధించి రాజస్ధాన్ ముఠా మూడు కిలోల బంగారు నగలు దోచుకుపోయింది. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు నార్త్ సబ్ డివిజన్ క్రైం సీఐ ఆర్వీఆర్కె చౌదరి, మహరాణిపేట క్రైం ఎస్ఐ గోపాలరావు, పరవాడ క్రైం ఎస్ఐ షరీఫ్, వన్టౌన్ క్రైం కానిస్టేబుల్ హరిప్రసాద్ బృందం రాజస్థాన్లోని బోధపూర్ వెళ్లి నిందితుల్ని పట్టుకున్నారు. అయితే నిందితులను పట్టుకున్న తరువాత వారిలో కొందరిని తప్పించేందుకు లంచం డిమాండ్ చేశారన్న అభియోగంతో అక్కడి ఏసీబీ అధికారులు ఈ పోలీసులను అరెస్ట్ చేసారు. అక్కడ ఏసీబీ కోర్టు విశాఖ పోలీసులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. దీంతో వారు రాజస్ధాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు శుక్రవారం వీరికి బెయిల్ రాజస్థాన్ హైకోర్టు మంజూరు చేసింది.