కొరియా ఓపెన్ సిరీస్ ఫైనల్లో సింధు జయకేతనం

కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ ఫైనల్లో తెలుగు తేజం పీవీ సింధు జయకేతనం ఎగురవేసింది. జపాన్ క్రీడాకారిణి ఒకుహరపై 22-20, 11-21, 21-18తో సింధు విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఒకుహర చేతిలో సింధు ఓటమి చవిచూసి రజతంతో సరిపెట్టుకుంది.
ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో అద్భుతంగా పోరాడిన సింధుకు తృటిలో స్వర్ణం చేజారిన విషయం తెలిసిందే. ఆ ఫైనల్లో సింధును ఓడించి ఒకుహర ఛాంపియన్ అయ్యింది. అయితే శనివారం జరిగిన కొరియా ఓపెన్ సెమీఫైనల్లో సింధు గెలుపొందింది. మరో సెమీఫైనల్లో ప్రపంచ నంబర్-2 యమగూచిని ఓడించి జపాన్ క్రీడాకారిణి నొజోమి ఒకుహర ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో మరోసారి వీరిద్దరికి టైటిల్ పోరు పడింది. ఆదివారం ఎంతో రసవత్తరంగా సాగిన ఈ ఫైనల్లో సింధు విజయం సాధించింది.