50 సం.ల కల.. సర్దార్ సరోవర్ డామ్

ఐదున్నర దశాబ్దాల నాటి కల నెరవేరిన వేళ. దేశంలో మరో బృహత్తర ప్రాజెక్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని నర్మద జిల్లా కెవాడియాలో 1961లో అప్పటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇంతవరకు దశలవారీగా సాగిన ఈ సుదీర్ఘ నిర్మాణం ఒక పెద్ద చరిత్రే. నిజానికి ఈ ప్రాజెక్టు నిర్మాణం తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కల. 1946లోనే ఆయన ఎంతో దూరదృష్టితో దీనిని ప్రతిపాదించారు. నర్మద నదిపై 30 భారీ ప్రాజెక్టులకు ప్రణాళికలు రచించగా వాటిలో సర్దార్ సరోవర్ డ్యామ్ అతిపెద్దది. డ్యామ్ నిర్మాణ నేపథ్యంలో పర్యావరణం, పునరావాసం తదితర అంశాలకు సంబంధించి అనేక వివాదాలూ, అధ్యాయాలూ ఉన్నాయి. చివరకు నర్మద నిర్వహణ సంస్థ తుది ఎత్తును ఖరారు చేసి ఈ ఏడాది జూన్ 17న డ్యామ్ గేట్లు మూసివేసి.. ఎత్తును 121.92 మీటర్ల నుంచి 138.68 మీటర్లకు పెంచారు. దీంతో నీటి నిల్వ సామర్ధ్యం 4.73 మిలియన్ ఎకరపు అడుగులకు పెరిగింది. ఈ డ్యామ్నే ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారు. వినియోగించిన కాంక్రీట్ పరిమాణం పరంగా సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రపంచంలోనే రెండో పెద్ద ప్రాజెక్టు. అమెరికాలోని గ్రాండ్ కౌలీ డ్యామ్ తర్వాత అత్యంత ఎక్కువ కాంక్రీట్ వినియోగించింది దీనికే. గ్రాండ్ కౌలీకి 8 మిలియన్ క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను వాడితే.. సరోవర్ డ్యామ్కు 6.82 మిలియన్ క్యూ.మీ.లు వినియోగించారు. ఈ కాంక్రీట్తో భూమధ్యరేఖకు ఇరువైపులా రోడ్లను నిర్మించవచ్చని అంచనా. ఈ ప్రాజెక్టు నుంచి ఇప్పటికే విద్యుదుత్పత్తి కొనసాగుతుండగా.. తాజా అంచనాల ప్రకారం ఏటా 100 కోట్ల యూనిట్ల జల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం రోజుకు 1450 మెగావాట్ల విద్యుత్తు తయారయ్యే సామర్ధ్యానికి నిర్మాణం పూర్తయింది. డ్యామ్ పరిధిలో రెండు విద్యుదుత్పత్తి కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిద్వారా ఇంతవరకు 4,141 కోట్ల యూనిట్ల విద్యుదుత్పత్తి అయింది. వీటి సామర్ధ్యం వరుసగా 1200, 250 మెగావాట్లు. వీటిద్వారా ఇంతవరకు రూ. 16 వేల కోట్ల ఆదాయం రావడం గొప్ప విశేషం. ఇక్కడ తయారయ్యే విద్యుత్తును మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లు 57 : 27 : 16 నిష్పత్తిలో పంచుకుంటాయి. సరోవర్ డ్యామ్ పొడవు 1.2 కిలో మీటర్లు. జలాశయం లోతు 163 మీటర్లు. దాదాపు 30 గేట్లున్న సాగర్ సరోవర్ డ్యామ్లో ఒక్కో గేటు బరువు 450 టన్నులకు పైగా ఉంటుంది. గేటు మూయాలంటే గంట పడుతుంది. డ్యామ్ ఎత్తు పెంచడంతో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు అత్యంత ప్రయోజనం పొందనున్నాయి. సాగునీటిని అందించడం ద్వారా పది లక్షల మంది రైతులకు, తాగునీరు ఇవ్వడం ద్వారా 4 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 18,144 గ్రామాలకు తాగునీరందిస్తారు. దాదాపు 18 లక్షల హెక్టార్లు సాగులోకి వస్తాయి. రాజస్థాన్లోని ఎడారి జిల్లాలైన బార్మెర్, జలోర్లు సహా మొత్తం 2.46 లక్షల హెక్టార్లకు సాగునీరందనుంది. మహారాష్ట్రలో 37,500 హెక్టార్లకు నీరందుతుంది. ఇక్కడ 9,633 గ్రామాలు, 131 పట్టణ ప్రాంతాలకు తాగునీటిని ప్రత్యేకంగా కేటాయించారు. అడుగడుగునా అడ్డుపడిన వివాదాలు 1961లో ఏప్రిల్ 5న శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు ను అడుగడుగునా వివాదాలు వేధించాయి. డ్యామ్ను వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ నడిపిన నర్మదా బచావో ఆందోళన్ (ఎన్బీఏ) వీటిలో ప్రధానమైనది. పర్యావరణ, పునరావాస సంబంధిత అంశాలపై ఎన్బీఏ అభ్యంతరాలు లేవనెత్తింది. ఆందోళనకారులు సుప్రీంకోర్టు నుంచి నిలుపుదల ఆదేశాలు తెచ్చి 1996లో పనులు ఆపేశారు. 2000 అక్టోబర్లో మిగిలిన పనులు చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. పునరావాసం, పరిహారం అందిన తర్వాతే దశలవారీగా డ్యామ్ ఎత్తు పెంచడానికి అనుమతిస్తామన్న షరతుతో ప్రభుత్వం పనులు జరిపి ఈ కలని సాకారం చేసింది.