మణిశంకర్ పై రాహుల్ గాంధీ ఆగ్రహం

కేంద్ర మాజీ మంత్రి మణి శంకర్ అయ్యర్ కు కాంగ్రెస్ పార్టీ పెద్ద షాకిచ్చింది. ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. అంతే కాకుండా ప్రధానిపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మణిశంకర్ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు. దీనిపై మోదీతో సహా బీజేపీ కీలక నేతలు మణిశంకర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చివరకు ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. క్షమాపణ చెప్పాలని అయ్యర్ ను ఆదేశించారు. దీంతో అయ్యర్ క్షమాపణలు చెప్పారు. 2014 లో నరేంద్ర మోదీని ‘చాయ్వాలా’ అంటూ హేళన చేసిన అయ్యర్ తాజాగా మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అంబేద్కర్ ఆశయాలకు వాస్తవ రూపం తేవడానికి జవహర్లాల్ నెహ్రూ కృషి చేస్తే, అటువంటి కుటుంబంపై ప్రధాని మోదీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోదీ నీచుడు, సభ్యత లేనివాడు అంటూ పలు అసంబద్ధ, అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే మణిశంకర్ వ్యాఖ్యల వలన గుజరాత్ ఎన్నికల్లో పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆందోళనతోనే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారని తెలుస్తోంది.